ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థుల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..
ఆర్థిక ఇబ్బందులు ఉన్న నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నాం..
పెద్దపల్లి:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.

పెద్దపల్లి మండలంలోని
రాఘవాపూర్ గ్రామంలోని రాధాకృష్ణ పంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకున్నారని మంత్రి అన్నారు.

10 శాఖల అధికారులు సమన్వయం చేసుకొని 99 రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని రానున్న రోజుల్లో మరో రెండు హామీలను అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని ఎస్సీ , ఎస్టీ ,బీసీ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వివరించారు. విద్యార్థులకు చదువుకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చే బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదలకు కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మంత్రి సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని సాగునీటి సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబు గారితో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపల్ చైర్మన్లు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.