హైదరాబాద్ ముద్ర కూకట్పల్లి,
ఫిబ్రవరి 13: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించి, అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయ కేతనాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్-చార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవాలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చిత్రపటానికి బండి రమేష్, పార్టీ ముఖ్య నాయకులు మరియు అనుచరులతో కలిసి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ మాజీ యూత్ ప్రెసిడెంట్ షేరి సతీష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, తెలంగాణలో రేవంత్ రెడ్డి అందిస్తున్న నిజాయితీ గల పాలన, సమర్థవంతమైన నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారని కొనియాడారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులే ఈ విజయా నికి పునాది అని, రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా ఏకపక్ష విజయాలను నమోదు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంబరాల్లో భాగంగా కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ ‘రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.