- మంత్రివర్గ విస్తరణపై అగ్రనేతలతో తుది చర్చలు.
- పీసీసీ కార్యవర్గంపైనా చర్చ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తీనా బాట పట్టనున్నారు. ఈ నెల 4న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రివర్గ విస్తరణ దాదాపుగా కొలిక్కి వచ్చిన నేపథ్యంలో దీనిపై చివరి సారిగా ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించనున్నారు. అలాగే పీసీసీ కార్యవర్గంపై పార్టీ హైకమాండ్తో కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.కేబినెట్ విస్తరణకు సంబంధించి సీఎం, టీపీసీసీ చీఫ్ ఇప్పటికే పలుసార్లు ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరిపారు. చివరకు రెండు రోజుల క్రితం కేసీ వేణుగోపాల్ భేటీ అయి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పు, రాష్ట్ర ఇతర అంశాలపై చర్చించారు.కానీ ఆ సమయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడం, రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడంతో తుది దశలో ఉన్న మంత్రివర్గ విస్తరణకు అనూహ్యం బ్రేక్ పడింది. దీంతో జూన్ రెండో వారంలోగా మంత్రివర్గాన్ని విస్తరించి తీరాల్సిందేనని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది.ఈ నేపథ్యంలో ఈనెల 4న ఢిల్లీకి రావాలని ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదీలావుంటే సీఎం రేవంత్ రెడ్డి గత నెల 30న హస్తినకు వెళ్లి రాహుల్ గాంధీని కలవాలని భావించారు. కానీ హైకమాండ్ అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఆయన పర్యటన వాయిదా పడినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.దీంతో మంత్రి వర్గ విస్తరణ, టీ పీసీసీ పోస్టుల భర్తీ ఆశావహులకు ఆడియాశలు ఎదురయ్యాయి.సీఎం ఢిల్లీకి వెళ్లగానే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఆయన పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం.