ముద్ర, కాప్రా
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఉప్పల్ డిపో ఎదుట ధర్నా కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ధర్నాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని, టెంట్ వేసుకునేందుకు అనుమతించకపోవడం, డిపోలో కార్మికులను టాయిలెట్కు కూడా వెళ్లనివ్వడం వంటి చర్యలు అన్యాయమని ఆరోపించారు.
అలాగే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలని చెబుతుంటే, ఆయన నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని పాటించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, పరిస్థితులు అటవీ రాజ్యాన్ని తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనతో ఉప్పల్ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.