ముద్ర మల్కాజ్గిరి
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హకింపేట డిపో వద్ద సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో రద్దీ పెరిగి డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం మంచిదే అయినా సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానం వల్ల కార్మికులు నష్టపోతున్నారని, తక్కువ జీతాలతో జీవనం కష్టమైందని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీని ఆపాలని, ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
రవాణా శాఖ మంత్రి ముందస్తు నోటీసులు ఉన్నప్పటికీ స్పందించకపోవడం సరైంది కాదని, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇటీవల మృతి చెందిన శంకర్ గౌడ్కు నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తూ, వారి పోరాటానికి సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.