Take a fresh look at your lifestyle.

జిల్లాలో ఇంధన కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: అడిషనల్ కలెక్టర్ మాధురి

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటగ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని అడిషనల్ కలెక్టర్ మాధురి స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా, వదంతులను నమ్మవద్దని ఆమె కోరారు.
గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటగ్యాస్‌ నిల్వలపై  సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ,జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, పెట్రోల్ బంక్‌లు మరియు గ్యాస్ ఏజెన్సీలకు సరఫరాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇటీవల పెట్రోల్ బంక్‌ల వద్ద కనిపిస్తున్న క్యూలను చూసి కొరత ఉందనే తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజలు అలాంటి వదంతులను నమ్మకూడదని సూచించారు. అవసరం లేకుండా ముందస్తుగా నిల్వ చేసుకోవడం వల్లే డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో సాధారణంగా రోజుకు సుమారు 10 వేల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్స్ ఉండగా, వదంతుల ప్రభావంతో అది 16 వేల వరకు పెరిగిందని తెలిపారు. అయినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, రెగ్యులర్ కోట యథావిధిగా అందుతోందని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్‌ను కంటైనర్లు, డబ్బాలలో తీసుకెళ్లడం చట్టవ్యతిరేకమే కాకుండా ప్రమాదకరమని హెచ్చరించారు.
గ్యాస్ ఏజెన్సీలు, డీలర్ల కార్యకలాపాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డీఎం సివిల్ సప్లై అంబదాస్, ఏఎస్‌వో రాజేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.