ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్
శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం నవమి శనివారం సందర్భంగా బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీ శనేశ్వర స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శని గ్రహ దోష నివారణార్థం భక్తులు స్వామివారికి తిలతైల అభిషేకాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తితో నిర్వహించారు. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శ్రీ శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయం భక్తులతో కిక్కిరిసింది.
ఆలయ ప్రధాన అర్చకులు డా. గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని ఆరాధించిన భక్తులకు విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. జన్మ, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు ప్రతి ఒక్కరూ శక్తిమేరకు స్వామివారిని పూజించాలని సూచించారు.
ఈ సందర్భంగా గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి భక్తులు రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. నందీశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.