నార్సింగి కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్న కాలనీవాసులు
ముద్ర, బండ్లగూడ: పార్కుల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఇచ్చిన స్థలాలను కబ్జాదారుల నుండి విముక్తి చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ నగర్ కాలనీవాసులు అన్నారు. కాలనీలో కేటాయించిన పార్కు స్థలాలు, వ్యాపార కేంద్రాల భవనాలను కాపాడాలంటూ నార్సింగి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. 300 నుండి 315 వరకు ఉన్న 85 ఎకరాలు స్థలంలో 1991లో హుడా అనుమతులతో వెంచర్ చేశారన్నారు. ఆ సమయంలో క్రీడాస్థలాల కోసం నాలుగు ప్రాంతాల్లో మొత్తం 6058 చదరపు గజాల స్థలాల భూమిని యజమానులు కేటాయించారన్నారు. 1993 లో 11194/1993 రిజిస్ట్రేషన్ నెంబర్ డాక్యుమెంట్ తో గ్రామపంచాయతీకి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారన్నారు. అయితే ప్రస్తుతం ఇందులో మూడు పార్కులు కబ్జాకు గురయ్యాయి అన్నారు. వాణిజ్య సముదాయాల కోసం కేటాయించిన 8174 గజాల స్థలాన్ని కూడా కబ్జా చేశారని వాపోయారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన ఈ స్థలాలకు కబ్జాదారుల నుండి విముక్తి కల్పించి, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అధికారులు ఇలాగ వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు.