ముద్ర ప్రతినిధి, నాగర్కర్నూల్:
నాగర్కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 పరీక్షా కేంద్రాల్లో మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలను అధికారులు సజావుగా నిర్వహించారు.
ఈ ఏడాది మొత్తం 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు కాగా, అందులో 10,637 మంది హాజరై 99.80 శాతం హాజరు నమోదైంది. కేవలం 21 మంది విద్యార్థులు మాత్రమే గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
చివరి రోజు సోషల్ స్టడీస్ పరీక్షతో పరీక్షలు ముగియగా, విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో పాల్గొన్న సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.