ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెకు సహకరించండి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
ముద్ర ప్రతినిధి యాదాద్రి భువనగిరి :
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విబి – జి రాంజీ చట్టాన్ని రద్దుచేసి పాత చట్టాన్ని కొనసాగించాలని, ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే 15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మె (బంద్) కార్యక్రమానికి సహకరించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి కి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో “సమ్మె” నోటీసును సంఘం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి బొల్లు యాదగిరి, కొండమడుగు నర్సింహ, జిల్లా ఉపాధ్యక్షులు, చీమల కొండూరు సర్పంచ్ పల్లెర్ల అంజయ్య లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ సంపదలో కీలక పాత్ర పోషిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఉపాధి హామీ కార్మికులు మోడీ తీసుకొచ్చిన జిరాంజి చట్టం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ నెల 15న నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెలో ఉపాధి హామీ కార్మికులు లక్షలాదిగా పని బంద్ చేసి పాల్గొనాలని వారు కోరారు.