ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భక్తకోటి ఆరాధ్యదైవమైన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతి సందర్భంగా భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన స్వర్ణగిరి క్షేత్రంలో మంగళవారం శ్రీ కార్యసిద్ధి హనుమజ్జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడిన 40 అడుగుల ఎత్తైన శ్రీ కార్యసిద్ధి హనుమంతుని విగ్రహానికి అర్చక వేదపండితులు ఆగమోక్తంగా విశేష పూజలు, తిరుమంజన కార్యక్రమాలు నిర్వహించారు.

మంగళవాయిద్యాల నడుమ, వేదఘోషల మధ్య ప్రారంభమైన ఈ మహోత్సవంలో ముందుగా స్వామివారికి పుణ్యాహవాచనం, సంకల్పం నిర్వహించి అనంతరం సుగంధ ద్రవ్యాలతో మహా అభిషేకం చేశారు. చందనం, కర్పూరం, కుంకుమ, పసుపు, తేనె, పాలు, పెరుగు, కొబ్బరినీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి విశేష తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తమలపాకులతో ప్రత్యేక అభిషేకం చేయగా, ఆ దివ్య దర్శనం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది.