ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని 13వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ పాల్గొని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనం శుభ్రంగా ఉండడమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలను సైతం శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించగలరని వారు పేర్కొన్నారు. రోడ్ల పైన ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారం వేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, రోడ్లపై వేస్తున్న చెత్తను శుభ్రం చేసి తాండూర్ పట్టణాన్ని శుభ్రంగా ఉండేందుకు దోహదపడుతున్న మున్సిపల్ కార్మికుల శ్రమను వారు ఎంతో కొనియాడారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో కూడా పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ మున్సిపల్ కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో తహసిల్దార్ తారా సింగ్, ఎంపీడీవో విశ్వ ప్రసాద్, వార్డ్ కౌన్సిలర్ సురేష్ నాయక్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.