ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి -కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు టీబీజేపీ ఎంపీల వినతి
నేషనల్ డెస్క్ :
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. తెలంగాణకు చెందిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్తో కూడిన ఎంపీల బృందం బుధవారం న్యూఢిల్లీలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆర్ఆర్బీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక పదోన్నతుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఆర్బీ ఉద్యోగుల కెరీర్లో ఎదుగుదల నిలిచిపోవడం అనేది గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా హెచ్ఆర్ విధానాల్లో తగిన సవరణలు చేపట్టాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.