- ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకునేలా వెసులుబాటు.
- ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు.
- 2.65 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలిచ్చాం.
- 71 వేల ఇండ్లు గ్రౌండింగ్.
- రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : మొండి గోడలతో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే ఆ ఇండ్లను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్ధలాలు లేని అర్హులైన లబ్దిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కంట్రాక్టర్ మోడ్ నుంచి లబ్దిదారులు నేతృత్వంలోని నిర్మాణం ( బీఎల్ సీ)మోడ్ లో చేపట్టి పూర్తిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మౌళిక వసతులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమన్నారు. కానీ పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు ఈ కర్తవ్యాన్నివిస్మరించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. పదేండ్ల వారి పాలనలో 60వేల ఇండ్లను మాత్రమే అరకొరగా పూర్తి చేశారని ఎద్దేవా చేశారు. త్రాగునీరు, సిమెంట్ రోడ్లు,డ్రైనేజీ,విద్యుత్ వంటి కనీస సదుపాయాలను విస్మరించారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మౌళిక వసతులు కల్పించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న 1.61 లక్షల ఇండ్లను రూ. 640 కోట్లతో పూర్తిచేసి 98 వేల మంది లబ్దిదారులకు కేటాయించామన్నారు. ఇంకా 69 వేల ఇండ్లు అసంపూర్తిగా వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వీటిని బీఎల్ సీ మోడ్లో పూర్తిచేస్తామని తెలిపారు.ఇందుకోసం అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి కేటాయించాలని ఈ ప్రక్రియను వీలైనంత త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
- 2.65 లక్షల ఇందిరమ్మ లబ్దిదారులకు మంజూరు పత్రాలు.
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు 2.65 లక్షల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసినట్లు వివరించారు.ఇప్పటివరకు 71వేల ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయన్న ఆయన వాటిలో మూడు వేల ఇండ్లు గోడలు, శ్లాబ్ల వరకు పూర్తయ్యాయని తెలిపారు.