మహాదేవపూర్, ముద్ర:
రాబోయే 2027 జనగణన నిర్వహణకు సంబంధించి అధికారులు సమర్థంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, విద్యాశాఖల అధికారులతో గణన ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
జనగణన రెండు దశల్లో నిర్వహించబడుతుందని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ ఉంటుందని, ఈ దశలో సర్వే ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి గృహాల వివరాలు సేకరిస్తారని స్పష్టం చేశారు. వాటిలో గృహ పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కుటుంబాల ఆస్తుల సమాచారం నమోదు చేస్తారని అన్నారు. ఈ వివరాలు రెండో దశ జనగణనకు ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడతాయన్నారు. మొదటి దశలో ఫీల్డ్ వర్క్తో పాటు 15 రోజుల స్వీయ నమోదు అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. రెండో
దశలో జనాభా గణన ఉంటుందని, ఎన్యూమ రేటర్లు ప్రతి ఇంటి నుండి ప్రజల వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తారన్నారు. ఇందులో జనాభా గణాంకాలు, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వివరాలు, వలసలు, జననాల వివరాలు తదితర సమాచారం సేకరిస్తారని తెలిపారు. ఫీల్డ్ వర్క్ అనంతరం 5 రోజుల రివిజన్ రౌండ్ నిర్వహించి వివరాలను ధృవీకరించాలని పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో సర్వేను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నందున అధికారులు ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా లేకుండా సమగ్రంగా వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఇంటిని తప్పకుండా సర్వే చేసి ఎఫిషియెన్సీ మరియు అక్యురసీతో పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సీపీఓ జవహర్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఓలు, మాస్టర్ ట్రైనర్లు,
హోబాలాల్, సరళ తదితరులు పాల్గొన్నారు.