నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో భాగంగా నాగర్ కర్నూల్ విద్యుత్ భవనంలో మూడో రోజు కూడా ఆర్టిసన్ కార్మికులు సమ్మెను కొనసాగించారు.
ఈ సందర్భంగా JAC డివిజన్ చైర్మన్ మిద్దె శ్రీనివాసులు మాట్లాడుతూ, తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. గత నెలలోనే విద్యుత్ శాఖ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చి, పలు దఫాలుగా ధర్నాలు, నిరసనలు చేపట్టినా సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. దీంతో ఆర్టిసన్ కార్మికులు సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్లు:
ఆర్టిసన్ కార్మికులకు విద్యుత్ సంస్థలోని APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
విద్యార్హతల ఆధారంగా రెగ్యులర్ పోస్టుల్లో కన్వర్షన్ కల్పించాలి
పీస్ రేట్ కార్మికులకు జీఓ నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలి
విద్యుత్ శాఖ యాజమాన్యం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో JAC నాయకులు దశరథం, సైదులు, ఉమ్మడి జిల్లా కో-చైర్మన్ రాజ్కుమార్, డివిజన్ కన్వీనర్లు జయకర్, మల్లయ్య, నాయకులు ప్రభాకర్, రాజ్ మనోహర్, ప్రవీణ్, ఉపేందర్, శంకర్, జితేందర్ రెడ్డి, నాగరాజు, వెంకటయ్య, విష్ణు, రాజు, రంజిత్ కుమార్, దయాకర్, అమర్నాథ్, మైబన్న, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా 327 యూనియన్ నుంచి డివిజన్ అధ్యక్షులు లక్ష్మయ్య, 1104 యూనియన్ నుంచి జిల్లా కార్యదర్శి నిరంజన్ యాదవ్, నాయకులు విజయ భాస్కర్, తిరుపతయ్య, BMS యూనియన్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్, జిల్లా కార్యదర్శి బాలరాజు, TRVKS యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొని సమ్మెకు మద్దతు ప్రకటించారు.