Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు.. ఆలయ ఈవో భవాని శంకర్ ఏర్పాట్లపై సమీక్షించి, భక్తులకు కీలక సూచనలు చేశారు.
వైభవంగా ధ్వజారోహణ.. నేటి నుండి వాహన సేవలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది. సాయంత్రం వేళ భేరిపూజ, దేవతాహ్వానం వంటి విశేష పూజలు జరగనున్నాయి. రేపటి నుండి స్వామివారి వివిధ వాహన సేవలు ప్రారంభం కానున్నాయని కలెక్టర్ తెలిపారు.
ఉత్సవాల్లో అత్యంత కీలకమైన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి..
ఫిబ్రవరి 24: ఎదుర్కోలు ఉత్సవం
ఫిబ్రవరి 25: స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం
ఫిబ్రవరి 26: దివ్య విమాన రథోత్సవం
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే అశేష భక్తజనవాహిణికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, ఆలయ కమిటీ పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. పాత బస్టాండ్ , వసతి గృహ సముదాయాల నుండి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. తాగునీరు, క్యూలైన్లు మరియు ఇతర కనీస సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని అధికారులు కోరారు. “బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సకల వసతులు కల్పిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలి” అని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు.