ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యఫలితంగానే బంజారాలకు సమాజంలో గుర్తింపు లభించిందని, బంజారా సమాజం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేసి, బంజారాలను తన మంచి మాటలతో వారిలో చైతన్యం తీసుకొచ్చారని, అందుకే ఆయనను బంజారాల ఆరాధ్య దైవంగా భావిస్తామని ఆయన తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని షేగావు లో జన్మించిన ఆయన అహింస సిద్ధాంతాన్ని బోధిస్తూ, సమాజంలోని మూఢనమ్మకాలు జంతుబలిని వ్యతిరేకిస్తూ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారన్నారు. ఇంతటి మహనీయుని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలంటే, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలని, అదేవిధంగా సేవాలాల్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ నెంబర్ వెంకట్ రాములు, నూతన మున్సిపల్ కౌన్సిలర్ సురేష్ నాయక్, అనిల్ రాథోడ్, గోపాల్, వివిధ గ్రామాల బంజారా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.