ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బ్యాంకులు తమ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. వివిధ బ్యాంకుల త్రైమాసిక సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని బ్యాంకుల ద్వారా ₹8409.62 కోట్ల రుణాలు మంజూరు చేయబడ్డాయని తెలిపారు. మొత్తంపై 64.56 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు. బ్యాంకులు ప్రజల ఉన్నతికి మరింత తోడ్పాటును అందించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాలు, సబ్సిడీ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. బ్యాంకులు అందించే పథకాల ద్వారా ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, ఆర్బీఐ ఎజిఎం రాములు, నాబార్డు డిడిఎం వీరభద్రుడు, బ్యాంకర్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.