ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
విద్యారంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న స్టడీ వైల్ ప్లేయింగ్ గేమ్స్ రూపకర్త బసవోజు దేవేంద్రాచారికి ప్రతిష్టాత్మకమైన ప్రగతి నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు–2026 ప్రదానం చేశారు.
హైదరాబాద్లోని బిర్లా మ్యూజియంలో ఉన్న భాస్కర ఆడిటోరియంలో ఈ అవార్డు ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులకు ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రగతి ఫౌండేషన్ చైర్మన్ డా. ఆరిఫ్, దూమ్ డాన్స్ స్టూడియో చైర్మన్ ఆజిమ్ సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి పద్మశ్రీ గ్రహీత కిన్నెర మొగలయ్య హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అదేవిధంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత సాజిదా ఖాన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సత్యకౌశ్యాప్, సొల్జర్స్ అకాడమీకి చెందిన చౌహన్ కృష్ణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ముంబై ప్రాంతాల నుండి అవార్డు గ్రహీతలు హాజరై కార్యక్రమాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వివిధ డాన్స్ అకాడమీల విద్యార్థులు అద్భుత నృత్య ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
విద్యా రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహించేలా ఈ అవార్డులు ప్రేరణగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు.