దార్శనిక దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
లక్ష్మీపురం స్కూల్ పనుల్లో వేగం పెంచండి
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
ఖమ్మం, ముద్ర :
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు. ఆదివారం మధిర నియోజకవర్గం లో పర్యటించిన భట్టి.. బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణం అవుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న భవన సముదాయాలను కలియతిరుగుతూ ఆయన పరిశీలన చేశారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జూనియర్ హాస్టల్, జూనియర్, సీనియర్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణాన్ని పరిశీలించిన విక్రమార్క. మెకానికల్, సైన్స్, మ్యాథమెటిక్స్ , కంప్యూటర్ ల్యాబ్ భవనాల నిర్మాణాలను పరిశీలించారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దు అని ఆయన చెప్పారు. ఇవి కేవలం భవనాలు కాదు రేపటి తరాలను ఉజ్వలంగా నిర్మించే దార్శనిక దేవాలయాలుగా ఆయన అభివర్ణించారు.