ముద్ర నడిగూడెం…..
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూసర్వే కార్యక్రమం సూర్యాపేట జిల్లా నడిగూడెంమండల పరిధిలోని పైలట్ ప్రాజెక్టు గ్రామమైన కాగిత రామచంద్రపురంలో జిల్లాలోనే మొదటగా శనివారం అధికారికంగా ఏడి నరసింహా రెడ్డి ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన రైతుల అవగాహన సభలో ఆయన మాట్లాడుతూ, భూభారతి భూ సర్వే ద్వారా గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల సరిహద్దులు,విస్తీర్ణం,భూ హక్కుల వివరాలు సమగ్రంగా,ఖచ్చితంగా నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఈసర్వే కార్యక్రమం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భూరికార్డులు మరింత పారదర్శకంగా, నమ్మదగినవిగా మారతాయని పేర్కొన్నారు. గ్రామ రైతులు,ప్రజలు సర్వే ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరించాలని,తమ భూములను సర్వే చేయించుకోవాలని కోరారు.ఈ సందర్భంగా కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ మాట్లాడుతూభూభారతి భూసర్వే కార్యక్రమం ద్వారా భూపరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని తెలిపారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని,ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తహసీల్దార్ రామకృష్ణారెడ్డి మరియు మండల సర్వేయర్ సరిత భూభారతి భూసర్వే విధానం,అమలు ప్రక్రియ, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా వివరించారు.సర్వే ప్రక్రియను అధికారులు పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తారని,ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కోదాడ డీఐ ముత్యా నాయక్, గ్రామ సర్పంచ్ చక్రాల ఉమా పిచ్చయ్య,ఆర్ఐ లు గోపి,మన్సూర్ అలీ,జిపిఓ నరసింహారావు,కార్యదర్శి అనిల్,సంబంధిత శాఖల అధికారులు,సిబ్బంది, గ్రామ పెద్దలు,రైతులు పాల్గొన్నారు.