సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో ప్రోటోకాల్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి-కలెక్టర్ ప్రతీక్ జైన్
-బావోజి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి
-రోడ్ మార్కింగ్ హద్దు దాటి దుకాణాలు ఏర్పాటు చేస్తే తొలగింప చేయాలి
ముద్ర, నారాయణపేట :
బావాజీ జాతర జరిగే ప్రాంతం సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం పరిధి అని, ప్రోటోకాల్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని, ఎవరు పడితే వారిని అనుమతించవద్దని పోలీసులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.

కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలోని బావోజీ ఆలయ అవరణలో సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఉత్సవాల ఏర్పాట్ల గురించి కలెక్టర్ ప్రతీక్ జైన్ కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ ఫణింద్ర రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ తిమ్మారెడ్డి పల్లి లో వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి 4 వరకు జరిగే శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు ( బావోజి) జాతర బ్రహ్మోత్సవాలకు అధికారులు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జాతరలో ముఖ్యంగా పార్కింగ్ ఏర్పాట్లు చాలా అవసరం అని, జాతరలో పిక్ పాకెటింగ్ జరగకుండా పోలీసులు నిరంతర నిఘా ఉంచాలన్నారు. గతేడాది జాతర ఉత్సవాలలో జరిగిన లోటు పాట్లను దృష్టిలో ఉంచుకొని ఈ సారి అలా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సారి జాతర ఉత్సవాలకు తాను కొత్తగా వచ్చాననీ, కానీ ఇక్కడున్న అధికారులంతా చాలా సీనియర్లు అని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారి మార్కింగ్ హద్దు దాటి ఎవరైనా దుకాణాలు ఏర్పాటు చేస్తే వెంటనే వాటిని తొలగింప చేయాలన్నారు.