Take a fresh look at your lifestyle.

నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయవద్దు  _ఎస్కీ కనస్ట్రక్షన్  అండ్ దిమాలిశన్  వర్క్ షాప్ లో జయేష్ రంజన్ 

ముద్ర,హైదరాబాద్:
రోజురోజుకు పెరిగిపోతున్న పట్టణీకరణ నేపథ్యంలో పలు  నిర్మాణాలతో పాటుగా  కూల్చివేత  వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, అక్రమంగా తరలిస్తున్న ఈ వ్యర్థాలు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పరిసరాల్లో, చెరువులు, కుంటలు, నాలాలు  ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారని, ఐకియా ప్రాంతంలోని పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాల గుట్టను తొలగించాలంటే సుమారు 60 కోట్లు ఖర్చు అవుతుందని,  ప్రజలు నిర్లక్ష్యంతో వేస్తున్న ఈ నిర్మాణ వ్యర్థాల వలన పర్యావరణ కాలుష్యం పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని  ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు.
ప్రజా పాలన,  ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా  హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్ మెంట్, స్పోర్ట్స్ డిపార్టుమెంటు సహకారంతో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా బుధవారం 6 మే, 2026 న  ఏర్పాటుచేసిన రివైజ్డ్ కన స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ మేనేజిమెంట్ రూల్స్ 2025 పై జరిగిన వర్క్ షాప్ లో జయేష్ రంజన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న సుమారు ఎనిమిది వేల టన్నుల చెత్తలో 1700 టన్నుల చెత్త కేవలం నిర్మాణ వ్యర్థా లైన  కాంక్రీట్,  మట్టి,  ఇసుక,  గ్రావెల్,  ఇటుకలు, పింగాణీ కలప, లోహాలు, ప్లాస్టిక్, పైపులు, టైల్స్ ఉంటున్నాయని, ఒకటన్ను చెత్త రవాణాకు ప్రభుత్వం రెండు వేలు ఖర్చు చేస్తున్న విషయాన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
వేస్ట్ టు వెల్త్ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్న ప్పటికీ,  నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే ప్లాంట్స్ ఇంకా ఎక్కువ అవసరమన్నారు. ప్రతి ప్రభుత్వ టెండర్ లో 20 నుండి 25 శాతం నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్ మెటీరియల్ వాడే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు జయేష్ రంజన్ తెలిపారు. హైదరాబాద్ నగరం 2047 నాటికీ నెట్ జీరో నగరంగా ఉండాలని ఇటీవల జరిగిన గ్లోబల్ సమిట్ లో ముఖ్యమంత్రి  నిర్ణయించారని, ప్రతి పౌరుడు, కాలుష్య నివారణ  తన బాధ్యతగా తీసుకోవాలన్నారు
ఉదయం జరిగిన సమావేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేషనల్ ఛైర్మెన్ సి. శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో స్టేషన్స్, ఐటీ బిల్డింగ్స్, తదితర భారీ నిర్మాణాల్లో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ కోసం రూపొందించిన 32 రేటింగ్స్ ను తాము పరిశీలిస్తామన్నారు.  నిర్మాణ వ్యర్థాలను పరిశీలించి సర్టిఫైడ్ చేసే ఒక సంస్థ తప్పనిసరిగా అవసరమన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యంగా ప్రభుత్వానికి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సమన్వయ కర్తగా పనిచేస్తున్న  తమ సంస్థ పలు నిర్మాణాల పనితీరును పరిశీలిస్తుందని, నిర్మాణ వ్యర్థాల  కొత్త రూల్స్  1 మార్చ్, 2026 నుండి అమల్లోకి వచ్చాయన్నారు.
ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు వర్క్ షాప్ ప్రాధాన్యతను వివరిస్తూ, ఇల్లీగల్ డంపింగ్ ను నివారించడానికి, రెగ్యులర్ మానిటరింగ్ మేనేజమెంట్ అవసరమన్నారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనర్ కమీషనర్ రఘు ప్రసాద్ కన్ స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ ప్రాధాన్యతపై సమగ్ర వివరణతో కూడిన ప్రెసెంటేషన్ ఇచ్చారు. నగరంలోని ఫతుల్లాగూడ, జీడిమెట్ల, శంషాబాద్, తూముకుంటలో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసే ప్లాంట్స్ ఉన్నాయని, మరిన్ని ప్లాంట్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసే యోచనలో ఉందన్నారు.
సమావేశంలో జి.హెచ్.ఎంసి రిటైర్డ్ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వర్ రావు,  సోమ శ్రీనివాస్ రెడ్డి ఇంజనీర్  అండ్ కాంట్రాక్టర్స్ డైరెక్టర్ సోమ శశాంక్ రెడ్డి, డెలాయిట్ సి అండ్ డి అధికారి అరవింద్ ప్రెసెంటేషన్స్ ఇచ్చారు.
ఈ వర్క్ షాప్ లో జి.హెచ్.ఎం.సి, మల్కాజిగిరి, సైబరాబాద్  మున్సిపల్ కార్పొరేషన్లతో పాటుగా, హైడ్రా, హెచ్.ఎం.డిఏ లో పనిచేస్తున్న పలువురు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు ఎస్కీ లోని సెంటర్ ఫర్ క్లయిమేట్   చేంజ్  డివిజన్ హెడ్ డాక్టర్ చంద్రకళ , ఫ్యాకల్టీ అది నరేష్ కార్యక్రమ సమన్వయ కర్తలుగా వ్యవహరించారు

Leave A Reply

Your email address will not be published.