జనాభా లెక్కలను అధికారులు దిగ్విజయంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
2027 జనాభా లెక్కలు దేశ అభివృద్ధికి ఎంతో కీలకం అని, అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి పేర్కొన్నారు. జిల్లాలో జనాభా గణన–2027 సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి ఆదివారం కలెక్టర్ సమావేశ మందిరం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, తో కలసి కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన నిబంధన ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి జనాభా గణన చేయాలన్నారు.
జిల్లా స్థాయిలో జనాభా గణనను సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఈ జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ (ఇళ్ల జాబితా) గృహాల గణన మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు, రెండో దశలో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుందని వివరించారు.జనన గణన 1872 లో మొదటి పాపులేషన్ సెన్సస్ చేయడం జరిగిందని అప్పుడు జరిగిన సెన్సెస్ గురించి ఆన్లైన్ వెబ్ లోకి వెళ్లి చూసి అవగాహన చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనలను ఎలా పాటిస్తారో సెన్సెస్ 2027 కూడా అదే నిబద్దతో నిబంధనల ప్రకారం అధికారులు పని చేయాలన్నారు. సెన్సెస్ ఆపరేషన్ రెండు విడతలుగా ఉంటుందని దాంట్లో ముఖ్యపాత్ర చార్జ్ అధికారులదేనని అన్నారు. ఈసారి జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని,మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. సెన్సస్ డిజిటల్ గా మారిపోయిందని క్రియేషన్స్ చేసుకోవడం చాలా సులభకరంగా ఉంటుందని, ఎవరి మొబైల్ ఫోన్లో వారే సొంతంగా అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకొని సర్వే చేయవచ్చని అన్నారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను గణన ప్రారంభానికి ముందు అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్ట చేశారు.
మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా, గృహాల గణనలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాలు, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగు నీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంట గది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు లాంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 34 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరిస్తారని వివరించారు.
మూడు రోజులలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి అంశాన్ని నేర్చుకుంటూ ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ ఆర్డీవోలు కృష్ణా రెడ్డి,శేఖర్ రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి, జిల్లా సెన్సెస్ అధికారి వెంకటరమణ , మున్సిపల్ కమీషనర్ లు, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిడిఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.