జీహెచ్ ఎంసీతో పాటు ఇతర విభాగాలతో సంయుక్తంగా చర్యలు
6 షాపులను సీజ్ చేసిన అధికారులు
హైదరాబాద్, జనవరి 30:
అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీపై రెండో రోజూ శుక్రవారం కూడా తనిఖీలు కొనసాగాయి. GHMC, హైడ్రా, ఫైర్, విద్యుత్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఫైర్ నిబంధనలను పట్టించుకోకుండా షాపులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. సెల్లార్లను గోదాములుగా మార్చడాన్ని అధికారులు సీరియస్గా పరిగణిస్తున్నారు. కెమికల్, పెయింట్ డబ్బాలు నిలువ ఉంచడం, ఫర్నీచర్ తయారీ సామగ్రీతో పరిసరాలు నిండి ఉండడాన్ని అధికారులు గమనించారు. భవన అనుమతులు, ఫైర్ ధ్రువీకరణ పత్రాలు(ఫైర్ ఎన్వోసీలు) లేకపోవడాన్ని పలు భవనాల్లో గుర్తించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మానవ ప్రమేయం లేకుండా.. ఆటోమేటిక్గా పని చేసే వాటర్ స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు లేకపోవడం.. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కానరాని పరిస్థితుల నేపథ్యంలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 6 షాపులను అధికారులు సీజ్ చేశారు. షాపులుంటున్న భవనాలను గోదాములుగా మార్చరాదని చెబుతూ వస్తోంది. గోదాములు వేరే చోట పెట్టుకుని.. షాపుల్లో ఫర్నీచర్ ప్రదర్శన, అమ్మకాలు మాత్రమే ఉండేలా చూడాలని హైడ్రా చెబుతూ వస్తోంది.
* 6 ఫర్నీచర్ షాపులను సీజ్ చేసిన అధికారులు
గచ్చిబౌలిలోని లుకింగ్ గుడ్ ఫర్నీచర్ షాప్ బిల్డింగ్ ను అధికారులు సీజ్ చేసిన అధికారులు. సెల్లార్లర్లో అగ్నిప్రమాదానికి ఆస్కారం ఉండే నిలువలు ఉంచినట్టు నిర్ధారించారు. పెయింట్ డబ్బులు, పరుపులు, బ్యాటరీలు, పెద్ద మొత్తంలో నిలువ ఉంచినట్టు గుర్తించారు. అనుమతి లేని భవనం తోడు ఫైర్ అనుమతులు కూడా లేని పరిస్థితి. సెల్లార్ల ర్యాంపులు మూసేసి స్టాక్ తో నింపినట్టు గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఇదే పరిస్థితి కొంపల్లి క్రాస్ రోడ్స్ లోని అను ఫర్నిచర్ షో రూంలో కూడా నెలకొంది. కూకట్పల్లితో పాటు అత్తాపూర్లోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేలో ఉన్న రోయల్ ఓక్ ఫర్నీచర్ షాపులు కూడా నిలువలు ప్రమాదకరంగా సెల్లార్లలో నింపేయడంతో అధికారులు సీజ్ చేశారు. ఉప్పల్ నాగోల్లోని బాంటియా ఫర్నీచర్ షోరూం, నాచారంలోని అను ఫర్నీచర్ షోరూంను సీజ్ చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ షాపుల పరిసరాలు ఫైర్ సేఫ్టీ లేని ప్రాంతంగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు.