* అక్కడ రూ.3,500(20టన్నులు) ఇక్కడ రూ.30,000 నుంచి రూ.35,000 అమ్ముతున్న ఇసుకమాఫీయా
* గద్వాల జిల్లాలో ఇసుక కావాలన్నా ఇసుక మాఫీయానే సంప్రదించాలి
* కర్నూల్ జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి గద్వాలకు నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్ ల ద్వారా ఇసుక తరలింపు
* కర్నూల్, మంత్రాలయం, కర్ణాటకల నుంచి 20 టిప్పర్ల పైగా ఇసుక రవాణ
* అక్రమ ఇసుక రవాణ జరుగుతున్న పట్టించుకోని మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమ ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ ,మంత్రాలయం, నాగల్ దిన్నె ప్రాంతాల తుంగభద్రా నదీతీరం నుంచి ఆంధ్ర, తెలంగాణకు చెందిన ఇసుక మాఫీయా లీడర్లు రాత్రివేళలలో
జోగుళాంబ గద్వాల జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి పన్నులు చెల్లించకుండా తరలిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి కొడుతున్నారు. ప్రధానంగా కర్నూల్ జిల్లా గద్వాల జిల్లా మద్య అంతరాష్ట్ర చెక్ పోస్టు మీదుగా అక్రమ ఇసుక రవాణ జరుగుతున్న జిల్లామైనింగ్ , పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో తుంగభద్ర, కృష్ణానదీ తీరాల నుంచి టిప్పర్ ల ద్వారా ఇసుకను అక్రమంగా అయిజ,గట్టు, కేటిదొడ్డి, ధరూర్ మండలాలకు రాత్రివేళలో ఆయా పోలీస్ స్టేషన్ ల మీదుగా తరలిస్తున్నారు. గట్టు, కేటిదొడ్డి మండలాల శివారు గ్రామాలలో ఇసుకను డంపులు నిలువ చేసి అక్కడ నుంచి అక్రమ రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దందా సాఫీగా నడవడానికి అధికారులుకు మాముళ్లు అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు

ఏపీలో ఉచితం.. తెలంగాణలో డిమాండ్ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్, మంత్రాలయం వద్ద గల గోదావరి నది నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. ఏపీలో 20టన్నుల ఇసుక రూ.3,500-రూ.4,000 మద్య లభిస్తుండటంతో కర్నూల్ ఇసుక మాఫియా వరంగా మారింది. గద్వాల జిల్లాలో తుంగభద్రనదీ తీరాన ఇసుకరీచ్ లు తరలించడానికి అనుమతులు పొందిన కాంట్రాక్టర్ , రాజకీయా నాయకుల మద్య సయోద్య కుదరకపోవడంతో ఇసుక రవాణ నిలిచిపోయింది. ఇదే అదునుగా తీసుకుని ఏపీ రాష్ట్రానికి చెందిన ఇసుక మాఫీయా గద్వాల జిల్లా ఇసుక బ్రోకర్ల ద్వారా ఏపీ ఇసుకను టిప్పర్ ల ద్వారా గద్వాల పట్టణంతో పాటు వివిధ మండలాలకు, మారుమూళ్ల గ్రామాలకు తరలిస్తున్నారు. ఏపీలో ఇసుక తక్కువ ధరకు లభిస్తుంది. తెలంగాణలో ఇసుకకు ఉన్న విపరీతమైన డిమాండ్ ను ఆంద్ర ఇసుక మాఫీయా క్యాష్ చేసుకునేందుకు, రాత్రికి రాత్రే భారీ టిప్పర్ ల ద్వారా గద్వాల జిల్లాకు తరలిస్తు కోట్లు గడిస్తున్నారు. గద్వాల్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల మీదుగా టిప్పర్ ల ద్వార అక్రమ ఇసుక రవాణ చేస్తున్న అధికారులకు ముడుపులు అందుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సరిహద్దులో అక్రమ ఇసుక డంపులు
తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల సరిహద్దును ఆసరాగా చేసుకొని అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణకు తెరలేపారు. ఏపీలోని మంత్రాలయం వద్ద తుంగభద్రనదీ, కర్ణాటక రాష్ట్రా కృష్ణానదీ తీరాల నుంచి టిప్పర్ ల ద్వారా అక్రమంగా తెచ్చుకున్న ఇసుకను పట్టపగలే గద్వాల్ జిల్లా గట్టు, కేటిదొడ్డి, అయిజ మండలాల సరిహద్దుల్లో డంపులు చేస్తున్నారు. అక్కడ నుంచి టిప్పర్లలో రాత్రికి రాత్రికే గట్టు, కేటిదొడ్డి, అయిజ, ధరూర్ మండలాలకు తరలిస్తున్నారు. ఇందుకు అధికారుల అండదండలు మెండుగా ఉండడంతో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఓవైపు ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని మొత్తుకుంటున్నా అక్రమార్కులు, అధికారులు వాటిని తుంగలో తొక్కేస్తున్నారు.
గస్తీని పెంచి అక్రమ రవాణాను అరికడతాం: ఏపీ, కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమ ఇసుక తరలింపుపై నిఘా పెడతాం. రాత్రివేళలో టిప్పర్ ల ద్వారా ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పెట్రోలింగ్ను పెంచుతాం. ఇసుక డంపులు నిలువ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
వై.మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల