ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున నుండే ప్రిసిబిటరీ ఇంచార్జ్ శాంతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా భక్తులకు బిషప్ ఎమెరిటస్ రైట్ రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ దైవ సందేశాన్ని వినిపించారు. మానవాళి పాప ప్రక్షాళన కోసం ఏసు క్రీస్తు తన ప్రాణాలను త్యజించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈస్టర్ కు ముందు వచ్చే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా నిర్వహిస్తారు. ఈ ప్రార్థనలలో హైదరాబాద్, నిజామాబాదు, కర్ణాటక ప్రాంతాల నుండి భక్తులు పాల్గొన్నారు.
