ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గ్రామ సమస్యల పరిష్కారమే గ్రామ సభల లక్ష్యమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ లో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు వంటి పథకాల ద్వారా జనం లబ్ధి పొందుతున్నారన్నారు. జిల్లాలో 60 వేల రేషన్ కార్డులిచ్చామన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించి, గ్రామాలలో నెలకొన్న సమస్యలను చర్చించి పరిష్కరించు కోవాలన్నారు. వైద్య కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ గ్రామసభలో డిపిఓ శ్రీనివాస్, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వనిత, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.