ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
గద్వాల:ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 22న అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే పురస్కరించుకుని ఉదయం 8.00 గంటల నుంచి 8.30 గంటల మధ్య విద్యార్థులు, యువతకు గద్వాల ప్రాక్టీసింగ్ హై స్కూల్ నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగరావు తెలిపారు.
సైకిల్ ర్యాలీకి సంబంధించిన గోడ పత్రికలను మంగళవారం తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలీ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, కాలుష్య నియంత్రణలో భాగంగా సైక్లింగ్ వంటి పర్యావరణ హిత మార్గాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అంతకుముందు గద్వాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల వద్ద జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ఉపాధ్యాయులతో కలిసి గోడ పత్రికలను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్జీసి జిల్లా సమన్వయకర్త శ్రీధర్, ఋషి రాజు, తదితరులు పాల్గొన్నారు.