ముద్ర, కుషాయిగూడ:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కుషాయిగూడలో“రోడ్ సేఫ్టీ డే”ను నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వ విభాగాలు రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. పోలీసు విభాగం ఆధ్వర్యంలో వాహనదారులు, పాదచారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే పనులు చేపట్టగా, సానిటేషన్ విభాగం రోడ్ల పక్కన చెత్త, మట్టి, రాళ్లు, ఇసుక వంటి అవరోధాలు లేకుండా శుభ్రత చర్యలు చేపట్టింది.
అదేవిధంగా ఎలక్ట్రికల్ విభాగం వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతులు చేపట్టడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి, విద్యుత్ తీగలు రోడ్లపై వేలాడకుండా చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ విభాగం డ్రైనేజీలు పొంగిపోకుండా చర్యలు తీసుకుని, మ్యాన్హోల్ కవర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి ఆదేశాల మేరకు కుషాయిగూడ ప్రగతి స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఎస్ఎఫ్ఏ లక్ష్మి , శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.