పశువులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతాం..
జిల్లాలో అదనపు సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం..
పెగడపల్లి:
పశు పోషణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని, పశుపోషణ చేస్తున్న రైతులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో నిర్వహించిన పశు వైద్య శిబిరానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పెగడపల్లి మండలంలో సుమారుగా 27 వేల గొర్రెలు, మేకలు, 6వేలకు పైగా ఆవులు, గేదెలు ఉన్నాయని మంత్రి తెలిపారు. జిల్లాలో పెద్ద ఎత్తున పశుపోషణ చేస్తున్న పెగడపల్లి మండలం పశు పోషకుల కొరకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పెగడపల్లి మండలంలో పశువుల కొరకు వెటర్నరీ సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
పశువులకు కావలసిన మందులను అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు. పశువులకు సంబంధించిన ఇన్సూరెన్స్ విషయంలో ఉన్న సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రైతులు పశుసంపద పెంపు పై దృష్టి సారించాలని ఇందుకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.