ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఈ నెల 11వ తేదీన నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసిందని ఎస్పీ డా.జానకి షర్మిల తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఫలితాలు వెల్లడించే వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా అంతటా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.ఎన్నికల ప్రక్రియ మొత్తం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఎలక్షన్ సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలు,కీలక ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుందని తెలిపారు. అనంతరం అభ్యర్థులు,వారి మద్దతుదారులు ఎవరూ కూడా ప్రచారం నిర్వహించరాదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్ డేగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులు వంటి వాటితో ప్రలోభాలకు గురిచేయవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.