ముద్ర నడిగూడెం….
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) నడిగూడెంలో వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం శనివారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, జీవన నైపుణ్యాల ట్రైనర్, విజయీభవ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ చారుగుండ్ల రాజశేఖర్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎస్ఐ అజయ్ కుమార్,విశిష్ట అతిథిగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బొగ్గారాపు రామమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ వ్యక్తిత్వ వికాసంతో సంతోషకరమైన జీవితం గడపవచ్చని పేర్కొన్నారు.విద్యార్థులు వివిధ సమయాల్లో పని ఒత్తిడికి గురవుతారని,ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరైన ప్రణాళిక, సమయపాలన అవసరమని సూచించారు. పదవ తరగతి పరీక్షల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన సోపానాలను వివరించారు.
“భయం వీడితే విజయం మీదే” అని చెబుతూ ఆత్మవిశ్వాసం, సమయపాలన, అపజయాలను విజయానికి మెట్టులుగా మార్చుకోవడం,ఓపిక, మానసిక ఏకాగ్రత వంటి అంశాలపై వర్క్షాప్ నిర్వహించారు.విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే విజయ గాథలను పంచుకున్నారు.
సోషల్ మీడియాలోని దుష్ప్రచారాల ప్రభావం, వాటిని ఎలాఎదుర్కోవాలో, జీవన నైపుణ్యాల ప్రాముఖ్యతపై కూడా శిక్షణ అందించారు.కార్యక్రమంలో భాగంగా అభిరుచి పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటరమణ, ఎస్ఐ అజయ్ కుమార్, రిటైర్డ్ప్రధానోపాధ్యాయులు బొగ్గారాపు రామమూర్తి, ఉపాధ్యాయులు సునీత తదితరులు పాల్గొన్నారు.