ముద్ర, నారాయణపేట:
పారిశుద్ధ్యం, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పుర వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా బుధవారం ఉదయం మున్సిపాలిటీ లోని 6 వ వార్డులో కొనసాగుతున్న పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ ను చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్ తో కలిసి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా వార్డు పరిధిలో గల బీసీ కాలనీ లో పర్యటించిన కలెక్టర్ అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు వాసుల సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందించారు. తమకు మరుగుదొడ్లు లేవని పలువురు మహిళలు కలెక్టర్ కు విన్నవించడంతో స్పందించిన ఆమె స్వచ్చ భరత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించి అనుమతి తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.