ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నీతి అయోగ్ లో పెంబి మండల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం, అధికారుల కృషితోనే సాధ్యమైందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. సోమవారం విశాఖపట్నం లో జరిగిన నీతి అయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్ లో జిల్లా కలెక్టర్ అభిలాష పాల్గొన్నారు. ఇందులో భాగంగా నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాకు కింద పెంబి మండలంలో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, తదితర మౌళిక సదుపాయాల కల్పనలో చేసిన కృషి, తద్వారా సాధించిన ప్రగతి వివరాలు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పెంబి అభివృద్ధిలో ఎదురైన సవాళ్లు, చేపట్టి చర్యలు సెమినార్ లో వెల్లడించారు. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, మహిళలు, గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాల నివారణ, రోగాల నిర్ధారణ, నివారణ, భూసార పరీక్షల నిర్వహణ, అక్షరాస్యత, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపు, మౌళిక సదుపాయాల మెరుగు, తదితర అంశాల్లో అద్భుత ప్రగతి సాధించినట్లు కలెక్టర్ వివరించారు. స్థానిక ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమష్టి కృషివల్ల పెంబి బ్లాకు ఆస్పిరేషన్ నుంచి ఇన్స్పిరేషన్ గా పయనించిందని సంతోషం వ్యక్తం చేశారు. పెంబి బ్లాకులో చేపట్టిన కార్యక్రమాలకు గాను, నీతి అయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్ కు నిర్మల్ జిల్లా ఎంపికయ్యింది. తెలంగాణ నుంచి కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఎంపికవ్వడం మన జిల్లాకు గర్వకారణమన్నారు.
పెంబి బ్లాక్ అభివృద్ధిలో పాలుపంచుకున్న అధికారులకు, ప్రజలకు మరొకసారి కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు.