ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా డ్రంకెన్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం మాత్రమే కాకుండా చట్టపరంగా కూడా శిక్షార్హమని పోలీసులు వాహన చోదకులకు వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలుంటాయని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా కార్ డ్రైవ్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై చట్ట పరమైన కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని, తమ కుటుంబాల భద్రత కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ జానకి షర్మిల కోరారు.