ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ తెలిపారు.

“మన తెలంగాణ – పరిశుభ్ర తెలంగాణ” అనే నినాదంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ మరియు కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి సాజీనా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన వర్క్షాప్లో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు ప్లాస్టిక్ కారణంగా జరిగే నష్టాలను కూలంకషంగా వివరించారు.
పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి సాజీనా మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ పెను సమస్యగా మారిందని, దాని నియంత్రణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇతరులను కూడా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వనిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ, ముజఫర్, దశరథం, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.