ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పొందవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి జడ్పి సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా పచ్చదనం పెంపొందించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధుల్లో అంకిత భావంతో పనిచేయాలన్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులతో మాట్లాడి జరిగిన పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు తదితర సామగ్రిని పంపిణీ చేశారు. ఆమె వెంట డీఈవో భోజన్న, తహసీల్దార్ ప్రభాకర్, ఎంఈవో వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ హరీష్ తదితరులున్నారు.