ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించండి ప్రతిపక్షాల మాయలో పడొద్దు -జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు సంయమనం పాటించాలని జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ప్రతిపక్షాల మాయలో పడి జీవితాలను పోగొట్టుకోవద్దని ఆయన కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
ఆర్టీసీ కార్మికుల ఆందోళనపై మంత్రి జూపల్లి ఆరా తీశారు. అనంతరం విడుదల చేసిన ప్రకటన విడుదల చేస్తూ వారి డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వారి సమ్మెను విరమింపజేసి ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోందన్నారు. తొందరపాటు చర్యలతో ప్రతిపక్షాల మాయలో పడొద్దని ఆ ప్రకటనలో కోరారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనను ఉక్కుపాదంతో అణిచివేసిన చరిత్ర గత ప్రభుత్వానిదని విమర్శించారు. ఆనాడు 55 రోజుల పాటు సమ్మె జరిగినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదన్నారు. 36 మంది ఆర్టీసీ కార్మికులు మరణించినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చలించలేదని విమర్శించారు.సమ్మె అంటే డిస్మిస్ అని నాటి పాలకులు హెచ్చరించారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు.