ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఫిర్యాదుదారుల నుండి మొత్తం 08 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, చట్టప్రకారం తక్షణ పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
స్వీకరించిన అర్జీలలో భూమికి సంబంధించినవి 03 కాగా, తగు న్యాయం కోరుతూ వచ్చినవి 05 ఉన్నాయి. ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలతో ఫోన్లో మాట్లాడి సమస్యల స్థితిగతులను తెలుసుకుని, త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు మరింత చేరువవుతూ, శాంతి భద్రతల పరిరక్షణే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.