ముద్ర, నారాయణపేట:
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం… అజాగ్రత్త…. రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడమేనని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా దామరగిద్ద మండల కేంద్రంలో అలాగే కోస్గి మండలం గుండుమల్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం వాహచోదకుల్లో అవగాహన కార్యక్రమాలు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి , తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని తెలియజేసారు. డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ లు శివశంకర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.