ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్:
జిల్లా కేంద్రంలోని రాహత్ నగర్ కాలనీ, స్నేహపూరి కాలనీ, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతుల పేరిట ఉదయం 9 గంటల నుంచే సరఫరా నిలిపివేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మరమ్మతుల సమయంలో ఎంతసేపు విద్యుత్ నిలిపివేస్తారో ఒక రోజు ముందే సమాచారం ఇస్తారని, కానీ ఈసారి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని వారు విమర్శించారు.
మధ్యాహ్నం 4 గంటల వరకూ కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో ఇంటింటా నీటి సమస్య తలెత్తింది. ఎండల తీవ్రత కారణంగా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అదేవిధంగా సమస్యపై విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదిస్తే స్పష్టమైన సమాధానం ఇవ్వడంలేదని, ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోతుందని ఆరోపించారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాలనీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.