ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ తెలిపారు.
శనివారం కల్వకుర్తి, తాడూర్ మండలాల్లోని కల్వకుర్తి జేపీ నగర్ గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, తాడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఉన్న సదుపాయాలు, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు.
విద్యార్థుల హాజరు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స వసతి వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శనివారం నిర్వహించిన గణిత పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 60 పరీక్షా కేంద్రాల్లో 10,650 మంది విద్యార్థులకు గాను 10,630 మంది హాజరయ్యారని, 20 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తం హాజరు శాతం 99.81 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.
అదేవిధంగా, ప్రైవేట్ విద్యార్థులు ఆరుగురు ఉండగా, అందరూ పరీక్షకు హాజరైనట్లు డీఈఓ తెలిపారు.