ముద్ర, నారాయణ పేట:
యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మద్దూరు పట్టణంలోని మన గ్రోమోర్ సెంటర్, కోస్గి పట్టణంలోని పీ ఏ సీ ఎస్ ను కలెక్టర్ సందర్శించారు. యూరియా బుకింగ్ యాప్ పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులు యూరియా ఎలా బుక్ చేసుకోవాలి, డీలర్లు ఎలా సేల్స్ కన్ఫర్మేషన్ చేయాలి అనే అంశాలపై రైతులు,,డీలర్లకు అవగాహన కల్పించారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియా బుక్ చేసుకోవచ్చని, ఎరువుల అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. డీలర్లు, ఆగ్రోస్, పీ ఏ సీ ఎస్ నిర్వాహకులు అందరూ ఆన్ లైన్ ఎరువుల అమ్మకాల విధానంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నారాయణపేట జిల్లా మరియు కోస్గి డివిజన్ పరిధిలో తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు.