Take a fresh look at your lifestyle.

పేదలందరికీ సొంతిళ్లు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వెలుగుమట్ల నిర్వాసితులందరికీ న్యాయం
ఇంటితో పాటు సౌకర్యాల కల్పన
బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు
డిసెంబర్ 9న గృహ ప్రవేశం
వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ

ముద్ర, ఖమ్మం :

పేద వర్గంలో ఏ ఒక్కరికీ సొంతిల్లు లేకుండా ఉండొద్దని రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వివాదస్పదంగా మారిన ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిర్వాసితుల్లో 412 మందిని అధికారికంగా గుర్తించామన్న ఆయన ప్రతి పేద కుటుంబానికి ఆసరాగా నిలిచామన్నారు. బాధితులకు ఇంటితో పాటు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వెలుగుమట్లలో ప్రభుత్వమే దగ్గర ఉండి భూమి పూజ చేయించి ఇండ్ల నిర్మాణం మొదలు పెడుతుందన్న భట్టి.. పట్టాలు ఇచ్చి భూమి పూజా చేయాలని స్ధానిక కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ను ఆదేశించారు. డిసెంబర్ 9 న సీఎం రేవంత్ రెడ్డిని ఖమ్మం ఆహ్వానించి లబ్దిదారులతో గృహప్రవేశం చేయిస్తామని తెలిపారు. బుధవారం వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. పేదల కోసం నిలబడి పని చేసే ప్రభుత్వాన్ని ఖమ్మంలో అభాసుపాలు చేసేందుకు ప్రతిపక్షం విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రతిపక్షానికి పేదలపై ప్రేమ లేదన్న ఆయన పేదల నిస్సహాయతను అడ్డు పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వెలుగుమట్లలో సమాంతర రాజ్యం నడిచిందని.. అక్కడి ప్రజలను సంరక్షించే ప్రయత్నం చేస్తే అధికారుల పై దాడికి యత్నించారన్నారు. పేద వర్గాలు ఆత్మ గౌరవంగా బతికేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు భట్టీ. తప్పుడు రికార్డులు సృష్టించి కోర్టులను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. అక్కడ చట్ట బద్దత చేయాలని నేటి ప్రభుత్వం నిర్ణియిస్తే.. ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నాలు బీఆర్ఎస్ చేసిందని విమర్శించారు. పేద ప్రజల పక్షానా కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందన్నారు. డబుల్ బెడ్ రూం లు ఇస్తామని గతంలో బీఆర్ఎస్ మోసం చేసిందని అన్నారు. బాధితులకు సొంతూర్లో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని తెలిపారు. పేదల నిస్సహాయతను అడ్డుపెట్టుకుని దోచుకున్న వారి పై కఠిన చర్యలు తీసుకుని డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. మాఫియాలతో , బ్లాక్ మెయిలర్లతో భయపడాల్సిన అవసరం లేదన్నారు. వెలుగుమట్ల భూముల్లో విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం. మిగతా 16 ఎకరాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తామన్నారు. స్థలం మిగిలితే రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్న వెల్ఫేర్ హస్టల్స్ నిర్నిస్తామని తెలిపారు. అదే విధంగా అక్కడ కమ్యునిటీ హల్ నిర్మిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు చూసి ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

గత నెలలో బాధితులు .. నేడు లబ్దిదారులు: పొంగులేటి
గత నెలలో బాధితులుగా ఉన్న వెలుగుమట్ల నిర్వాసితులు నేడు ఇందిరమ్మ లబ్దిదారులుగా మారారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నష్ట పోయిన ప్రతి వారిని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఇది పేద వర్గాల ఆశీస్సులతో ఏర్పడిన ప్రభుత్వం.. పేద వర్గాలకు అండగా ఉంటుందన్నారు. లబ్ధిదారులు జన్యున్ గా ఉంటే అందరికి ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 311 మందికి ఇండ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు , 101 మందికి వారి సొంత స్థలం లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వ్యక్తిగతంగా ఎంత దుమ్మెత్తి పోసినా మనసులో పెట్టుకోకుండా లబ్ది చేకూరిస్తామని చెప్పారు మంత్రి. దొరల పాలనలో పేదలకు అన్యాయం చేశారని విమర్శిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వారు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో వెలుగుమట్లలో ప్రజలు నరకాన్ని చూశారన్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగుమట్ల కాలనీని కూల్చే ప్రయత్నం చేసింది.. పదేళ్లు రాజ్యంలో ఉన్న బీఆర్ఎస్ కు నాడు ఎందుకు బుద్ధి రాలేదు.? వెలుగుమట్లపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ కు కనీస నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు.

పేదలను నమ్మించి బోగస్ పట్టాలు: మంత్రి తుమ్మల
పేదలను ముందు పెట్టి దళారులు దోపిడి చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. 31.7 ఎకరాల భూమిలో బోగస్ హౌస్ సైట్ పట్టాలు ఇచ్చారని తెలిపారు. భూదాన్ ట్రస్ట్ సీసీఎల్ఎ కు బదాలయించినట్లు చెప్పారు. సీసీఎల్ఎ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పక్కన ఒక ప్రత్యేక ముఠా మేస్త్రుల రాజ్యం నడిచిందన్న ఆయన దగా కోరులను పట్టుకోవాలంటే అందరినీ బయటకు పంపాల్సి వచ్చిందని తెలిపారు. నిరుపేదలు మోస పోయిన చోటనే ఇండ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.