ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్య సేకరణలో లక్ష్యాలను అధిగమించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేటులోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం సేకరణకై సంబంధిత అధికారులతో కార్యాచరణ ప్రణాళికపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్ సంబంధించి వరి ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రబీ 2025-26 వరి ధాన్య సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జిల్లాలోని 129 వరి ధాన్యం సేకరణ కేంద్రాలను సంబంధిత అధికారులు సందర్శించి మౌలిక సదుపాయాల కల్పనకై చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వరి ధాన్య సేకరణ సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. వివిధ ఏజెన్సీల ద్వారా లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వరి ధాన్యం, పదివేల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని సేకరించే దిశగా అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, జిల్లా అదనపు జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి, డి సి ఎం ఎస్ బిజినెస్ మేనేజర్ వెంకట రమణారెడ్డి, డిప్యూటీ డిఆర్డిఏ నరసింహులు, రవాణా కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.