ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడి ప్రజల మనిషిగా నిలిచిన గొప్ప వ్యక్తి దుద్దిళ్ల శ్రీపాదరావు అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ముదావహమని అన్నారు. శ్రీపాదరావు చేసిన మంచి పనులే ఆయనను ప్రజల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేశాయన్నారు. నేటి తరానికి ఆయన ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయాలు, లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు, ఆర్డిఓ రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, డీఈవో భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిటిడివో అంబాజీ, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.