ముద్ర, శేరిలింగంపల్లి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజాసేవలో శ్రీపాదరావు చూపిన నిబద్ధత, నిరాడంబరత నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఆయన బాధ్యతలు నిర్వహించిన తీరు అద్వితీయమని కొనియాడారు. సభలో క్రమశిక్షణను కాపాడటంతో పాటు పారదర్శకతకు, ప్రజాస్వామ్య విలువలకు ఆయన పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ప్రజాహితమే పరమావధిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, క్రైమ్స్ డీసీపీ ముత్యంరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ – I రంజన్ రతన్ కుమార్, మాదాపూర్ ట్రాఫిక్ ఎడీసీపీ హనుమంతరావు, వెల్ఫేర్ స్టార్స్ ఆర్ఐ అనిల్, ఎస్టేట్ ఆఫీసర్ ఆర్ఐ హిమకర్, అకౌంట్స్ విభాగం ప్రతినిధులు, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.