ముద్ర ప్రతినిధి, నిర్మల్:
స్థానిక ఎస్ ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ చర్మ వ్యాధులు, కాస్మోటాలజీ నిపుణులు డాక్టర్ అమరేశ్వర్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ శృతి వాస ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు, డిజిటల్ స్క్రీన్ల వాడకం వల్ల పిల్లల్లో తలెత్తుతున్న చర్మ, కంటి సమస్యలను గుర్తించి వారికి తగిన చికిత్సను సూచించారు. ఈ సందర్భంగా చిన్నతనం నుంచే సరైన ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల జోనల్ ఇంచార్జి నగేష్, శిరీష, పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్ పాల్గొన్నారు.